శ్రీరామనవమి వేడుకల గురించి ఏపీ మంత్రి వెల్లంపల్లి ప్రకటన!

  • దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్
  • పుణ్యక్షేత్రాలు, దేవాలయాల్లోకి భక్తులకు అనుమతి నిరాకరణ
  • శ్రీరామ నవమిని ఇంట్లోనే జరుపుకోవాలన్న ఏపీ మంత్రి వెల్లంపల్లి
  • వైష్ణవ ఆలయాల్లో అర్చకులు మాత్రమే పూజలు, వేడుకలు నిర్వహిస్తారని వెల్లడి
కరోనా కారణంగా దేశవ్యాప్త లాక్ డౌన్ విధించడంతో దేవాలయాలు, పుణ్యక్షేత్రాలపైనా ఆ ప్రభావం పడింది. అయితే ఏప్రిల్ 2న శ్రీరామనవమి పండుగ కావడంతో ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ అమల్లో ఉన్నందున ఆలయాల్లోకి భక్తులను అనుమతించబోరని, అందుకే రాష్ట్రంలోని ప్రధాన వైష్ణవ ఆలయాల్లో ఏప్రిల్ 2న శ్రీరామనవమి నాడు అర్చకులు మాత్రమే పూజాదికాలు, వేడుకలు నిర్వహిస్తారని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో వెల్లడించారు.

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో, ప్రజారోగ్యం మేరకు భక్తులు స్వచ్ఛందంగా దేవాలయ దర్శనాలను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పండుగ నాడు ఇంట్లోనే శ్రీరామనవమి పూజలు నిర్వహించుకోవాలని సూచించారు. ఈ పర్యాయం నిరాడంబరంగా పండుగ జరుపుకుందామని, సామాజిక దూరం పాటిద్దామని మంత్రి పిలుపునిచ్చారు. అటు, ప్రధాన దేవాలయాల్లో స్వామివార్లకు, అమ్మవార్లకు నిత్యం జరిగే నివేదనలు, పూజలు యథావిధిగా జరుగుతున్నాయని వెల్లడించారు.

Sriramanavami
Andhra Pradesh
Vellampalli Srinivasa Rao
Corona Virus

More Telugu News